తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబుది ఒక ప్రత్యకమైన స్థానం. తన విలక్షణమైన నటనతో, డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా ఆయన సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మరోవైపు, ఇండస్ట్రీలో ఆయన 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్ర బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేసింది. 48 ఏళ్ల ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారని కొనియాడింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్, పార్వతీదేవి పాత్రలో నయనతార నటిస్తుండగా… మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.









