కాంగ్రెస్ గెలిచినా కేసీఆర్ సీఎం అవుతారంటూ కామెంట్స్
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు..
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం లేదని, ఒకవేళ రేపు కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్నే అని తెలిపారు. చేవెళ్లలో ఈ నెల 23న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఈ సన్నాహక సమావేశానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
మొయినాబాద్లో జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రజల చేత చీత్కారం పొందిన పార్టీ అది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసులను నమ్ముకున్నారు. ప్రతిపక్ష నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లోంగకపోతే కేసులు పెడుతున్నారు. ఇది పరాకాష్టకు చేరుకుంది. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. బీఆర్ఎస్ను ఎదిరించి నిలిచే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టే భాద్యత మన మీద ఉంది’ అని వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనియ్యడం లేదు. రేపు కాంగ్రెస్ గెలిచిన ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్నే. అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సభను విజయవంతం చేసి ఢిల్లీ నాయకత్వానికి మరింత విశ్వాసం కల్పిద్దాం. తెలంగాణ గడ్డ బీజేపీ అడ్డా అని నిరూపిద్దాం’ అంటూ ఈటల తెలిపారు.









