తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలను పరుగులు పెట్టించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పేదలకు ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, డిఫాల్ట్ రైస్మిల్లర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం కేపీహెచ్బీ లో తొలి ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేపీహెచ్బీ 7, 9 ఫేజ్ల మధ్య, మలేషియన్ టౌన్షిప్కు ఎదురుగా ఉన్న అత్యంత విలువైన హౌసింగ్ బోర్డు స్థలంలో ఈ టవర్లను నిర్మించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనుండగా, ఇవి BPL కుటుంబాలకు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు నీటిపారుదల శాఖను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్లోని MCR HRD బోధి పెవిలియన్లో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, నీటి వనరుల సమర్థ నిర్వహణపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
పౌరసరఫరాల శాఖ సమీక్షలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్ల బ్లాక్మెయిలింగ్ సహించేది లేదని, బకాయిలను తక్షణమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. బకాయిలు కట్టని మిల్లులను స్వాధీనం చేసుకుని, వాటి బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్గా ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 50 నుంచి 100 ఎకరాల్లో గోదాములను నిర్మించాలని ఆదేశించారు.
గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్య మైనంత మేరకు ఎత్తిపోతలు చేపట్టాలన్నారు.
దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని సమావేశంలో మంత్రి వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే అధికారులు వాటి పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి సూచించారు. పలు ప్రాజెక్టుల కింద ఒకట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు అంశాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నీటి పారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
ప్రభావం పడే గ్రామాలకు పరిహారం..
తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి సూచించారు. అధికారులు ఆ పనులను పూర్తి చేస్తే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవకాశం ఉంటుందని తెలిపారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్ నియమించాలని ఆదేశించారు.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం లేదని, ఈ విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలన్నారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ఎన్డీఎస్ఏతో సంప్రదించాలని ముఖ్యమంత్రి సూచించారు.








