AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ యువతకు ఆర్మీ అవకాశాలు.. సదరన్ కమాండ్ అధికారులతో సీఎం రేవంత్ కీలక భేటీ..!

భారత సాయుధ దళాల్లో తెలంగాణ యువత ప్రాతినిధ్యం పెరిగేలా, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లలో వారికి పూర్తి మద్దతుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCR HRD) లో ఉన్న ‘బోధి పెవిలియన్’ వేదికగా భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తో సీఎం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు TASA సబ్‌ ఏరియా జీఓసీ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్మీ నియామకాల్లో మన స్థానిక యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. ఆర్మీకి ఆసక్తి ఉన్న యువకుల కోసం రాష్ట్రంలోని ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ముందస్తు శిక్షణా కార్యక్రమాలు (Pre-recruitment Training) నిర్వహించాలని సీఎం కోరారు. దీనికి లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు ముందు తెలంగాణలోని జిల్లాల్లో యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దేశంలో క్లిష్ట పరిస్థితులు, విపత్తులు ఎదురైనప్పుడు సైన్యం అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. దీనిపై స్పందించిన సైనిక అధికారులు, తెలంగాణలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే స్థానిక ఆర్మీ బృందాలు తక్షణమే రంగంలోకి దిగేలా ఆదేశాలు ఇస్తామని చెప్పారు.

హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు, దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చేపట్టిన ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ ను లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ అభినందించారు. చారిత్రక హైదరాబాద్ నగర పరిరక్షణకు మూసీ ప్రక్షాళన ఎంతో కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.

ANN TOP 10