తెలంగాణలో విప్లవోద్యమం బలహీనపడిన మాట వాస్తవమే కావచ్చునని, కానీ.. విప్లవం మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని సీపీఐ(ఎంల్) జనశక్తి కేంద్ర నాయకుడు కూర రాజన్న అన్నారు. కామారెడ్డిలో చందాల వసూళ్ల కేసులో రాజన్న(80)కు బెయిల్ మంజూరు కావడంతో 10 నెలల తర్వాత చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఓ హత్య కేసులో విచారణకుగాను నేరుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జైళ్లను దిద్దుబాటు కేంద్రాలుగా చెబుతున్న ప్రభుత్వాలు అండర్ ట్రయల్ ఖైదీలను జైల్లో పెడుతున్నాయని, వారిని శిక్షపడిన ఖైదీల్లాగే చూస్తున్నాయని విమర్శించారు.
అండర్ ట్రయల్ ఖైదీలను జ్యుడీషియల్ హోమ్లలో పెట్టాలన్నారు. ప్రతి ఖైదీ కూడా పౌరుల్లాగే మానవ హక్కులు కలిగి ఉంటాడనే విషయాన్ని గుర్తించాలన్నారు. జైళ్లలో నేరస్థుల్లో మార్పు తెచ్చి సత్ప్రవర్తన కల్పించాలని, కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. జనవరి 26, ఆగస్టు 15న ఖైదీల విడుదలను ప్రభుత్వాలు మరిచిపోయాయని, ఇప్పటికైనా ఖైదీలను విడుదల చేయాలని కోరారు. తనపై ఐదు అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. కామారెడ్డిలో చందాల కేసు సమయంలో తాను జైల్లో ఉన్నానని, అయినప్పటికీ తాను పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారన్నారు. రాజ న్న వెంట జనశక్తి మాజీ రాష్ట్ర కార్యదర్శి కూర దేవేందర్ అలియాస్ అమర్, అరుణోదయ విమలక్క, పర్శ హనుమాండ్లు తదితరులు ఉన్నారు.









