పాఠశాలల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉక్కుపాదం మోపింది. సెలవు ముందస్తుగా మంజూరు కాకుండా విధులకు రాని వారిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు.
ఈ మేరకు బుధవారం ఆయన అన్ని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ), జిల్లా విద్యాధికారులకు(డీఈవో) అత్యవసర మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ, కొందరు సిబ్బంది సుదీర్ఘకాలం పాటు విధులకు హాజరుకాకపోవడం వల్ల బడుల్లో విద్యాబోధనతో పాటు పరిపాలన కుంటుపడుతోందని డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగి కొద్ది రోజులే గైర్హాజరయ్యారు కదా అని అధికారులు వేచి చూడాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా విధులకు రాకపోతే, ఆ రోజును హాజరు పట్టికలో వెంటనే ‘అనధికార గైర్హాజర్’గా నమోదు చేయాలని ఆదేశించారు. సదరు ఉద్యోగిని వెంటనే విధుల్లో చేరాల్సిందిగా ఆదేశిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు. క్రమశిక్షణా చర్యలు చేపట్టడానికి ఎటువంటి కనీస కాలపరిమితి లేదని, తక్కువ రోజులే కదా అని చర్యలను వాయిదా వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇదిలాఉండగా ఉపాధ్యాయులు లేదా సిబ్బంది నిరంతరాయంగా ఏడాదికి పైగా విధులకు అనధికారికంగా దూరంగా ఉంటే, సీసీఏ నిబంధనల ప్రకారం విచారణ జరిపి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని హెచ్చరించారు.
అలాగే ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఏడాది కంటే ఎక్కువ కాలం గైర్హాజరైనా, లేదా సెలవులతో కలిపి ఐదేళ్ల పాటు నిరంతరాయంగా విధులకు దూరంగా ఉన్నా.. వారు సర్వీసుకు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగానే ప్రభుత్వం భావిస్తుందని స్పష్టం చేశారు. అనుమతి లేని గైర్హాజరీ కాలాన్ని ‘డైస్-నాన్’గా పరిగణిస్తారని, దీనివల్ల సదరు ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు, సెలవులు, భవిష్యత్తులో వచ్చే పెన్షన్ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నిబంధనల అమలులో జిల్లా, మండల స్థాయి అధికారులదే పూర్తి బాధ్యత అని విద్యాశాఖ స్పష్టం చేసింది. హెచ్ఎంలు, ఎంఈఓలు, డీఈవోలు, ఆర్జేడీలు ఈ కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలన్నారు. గైర్హాజరీపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినా, కాలయాపన చేసినా పర్యవేక్షణ అధికారులపైనే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందుకోసం ప్రతి జిల్లా, ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.








