ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, పనుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ ఆర్. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటివరకు రూ. 12,620.53 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ప్రాజెక్టు మొదటి దశ (ఫేజ్-I) కింద సవరించిన అంచనా వ్యయం రూ. 30,436.95 కోట్లకు కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
చివరి దశకు చేరిన డ్యామ్ పనులు
ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్వే, ఎర్త్-కం-రాక్ఫిల్ (ECRF) డ్యామ్ పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస ప్రక్రియను కూడా వేగవంతం చేశామని, ఇందులో భాగంగా ఇప్పటివరకు 17,892 కుటుంబాలను కొత్త ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. వీరి పునరావాస పనుల కోసం రూ. 1,373.01 కోట్లు చెల్లించినట్లు మంత్రి సభకు తెలిపారు.
పోలవరం ఫేజ్-I నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు గతంలో మార్చి 2026ను లక్ష్యంగా పెట్టుకోగా, క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఆ గడువును మరో ఏడాది పొడిగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేసి, ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రాధాన్యమని కేంద్ర ప్రభుత్వం వివరించింది.









