AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మోడియా బింద్’ గ్లాసెస్‌తో ఎంపీ రేణుకా చౌదరి నిరసన..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తన నిరసన గళాన్ని మరింత పెంచింది. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్ష నేతలు నిత్యం ఏదో ఒక వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ప్రదర్శించిన ఒక డిఫరెంట్ ప్రొటెస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేణుకా చౌదరి ‘మోడియా బింద్’ (Modiabind) అని రాసి ఉన్న ఒక వినూత్నమైన కళ్లజోడును ధరించి పార్లమెంట్ కాంప్లెక్స్‌కు వచ్చారు. నల్లటి అద్దాలపై స్పష్టంగా కనిపించేలా ఉన్న ఈ పేరు ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది. ప్రభుత్వం సభలో అనుసరిస్తున్న తీరును ఎండగట్టడానికే తాను ఈ నిరసన బాట పట్టినట్లు ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణంగా కంటి శుక్లాలు వస్తే ఆసుపత్రికి వెళ్తాం. అక్కడ వైద్యులు చికిత్స చేసి నయం చేస్తారు. కానీ, మన పార్లమెంటులో చాలామంది అంధ అనుచరులు ‘మోడియా బింద్’ అనే విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు’ అని ఆమె చమత్కరించారు.

దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సొంత పార్టీ నేతలు, మద్ధతుదారులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఏది చేసినా కళ్లు మూసుకుని మద్దతు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అందుకే వారి కళ్లకు ఉన్న ఈ ‘మోడియా బింద్’ పొరలను తొలగించాల్సి ఉందంటూ ఘాటుగా విమర్శించారు. ఆమె చేసిన ఈ వినూత్న నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది.

ANN TOP 10