AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మా నాన్న వల్లే రేవంత్ రెడ్డికి ఆ పదవి..! ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన షెల్ కంపెనీకి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కేటాయించారని ఆరోపించారు.

రక్షణ, ఎయిరో స్పేస్ రంగాలకు సంబంధించిన వస్తువులను తయారు చేస్తామనే పేరుతో ‘టెసరాక్ అడ్వాన్స్ సిస్టమ్స్’ అనే కంపెనీకి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా భూమిని కేటాయించారని అరవింద్ వివరించారు. నిజానికి ఈ కంపెనీ గురించి శోధిస్తే బట్టలకు రంగులు వేసే యంత్రాలు, స్పేస్ ఎక్స్ వెబ్‌సైట్ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రక్షణ రంగానికి సంబంధించి ఉత్పత్తులు తయారుచేసే అసలైన కంపెనీల జాబితాలో ఈ టెసరాక్ అడ్వాన్స్ సిస్టమ్స్ అసలు లేనే లేదని స్పష్టం చేశారు.

శంషాబాద్ సమీపంలోని రవిర్యాల్, మహేశ్వరం వద్ద ఉన్న దాదాపు 5 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కొండల్ రెడ్డి కంపెనీకి కేవలం రూ. 7.5 కోట్లకు మాత్రమే కట్టబెట్టిందని ఎంపీ ఆరోపించారు. దాదాపు 27 రెట్ల రేటును తగ్గించి, రూ. 119 కోట్ల మేర తక్కువ ధరకు ఈ భూమిని కట్టబెట్టారని, దీనివెనుక వందల కోట్ల రూపాయల భూ కుంభకోణం దాగి ఉందని మండిపడ్డారు. ఈ భూకేటాయింపుల నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఉందో లేదో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు మంచోడని, ఈ వ్యవహారంలో వేలు పెట్టి తన పేరును పాడుచేసుకోవద్దని సూచించారు.

తన కుటుంబ నేపథ్యంపై మాట్లాడుతూ.. గతంలో రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి రావడానికి తన తండ్రి డి.శ్రీనివాస్ కారణమని గుర్తుచేశారు. యూపీఏ-1, యూపీఏ-2 కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే తమ నాన్న శ్రమ ఉందన్నారు. అయితే, తన డీఎన్ఏలో మాత్రం కాంగ్రెస్ భావజాలం లేదని, తండ్రి ద్వారా ఎలాంటి అక్రమ సంపాదన లేదని అరవింద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన బంధువుల షెల్ కంపెనీలకు ఇంకా ఎన్ని కోట్ల విలువైన భూములు కేటాయించారో బయటకు తీస్తామని చెప్పారు

ANN TOP 10