AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు..

టీడీపీ మహానాడు నిర్వహణపై మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది నిర్వహించిన మహానాడును ఆమె ఒక ‘హైబ్రిడ్ మహానాడు’ గా అభివర్ణిస్తూ, ఇది ముమ్మాటికీ అట్టర్‌ఫ్లాప్ షో అని కొట్టిపారేశారు. బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఒకవైపు నాయకులు స్పీచ్‌లు దంచుతుంటే, మరోవైపు జనాన్ని ఆకట్టుకోవడానికి రికార్డింగ్ డాన్సులు పెట్టాల్సి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.

 

ఈ మహానాడు వేదికలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేర్ల కంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణే ఎక్కువగా వినిపించిందని రోజా విమర్శించారు. జగన్ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎలాంటి వణుకు పుడుతుందో దీనిని బట్టే అర్థమవుతోందని, అందుకే వారి ప్రసంగాలన్నీ జగన్ చుట్టూనే తిరిగాయని ఆమె మండిపడ్డారు.

 

టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటారని, మరి అలాంటప్పుడు డిజిటల్ స్క్రీన్ల ముందు జనం ఎందుకు లేరని రోజా ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ టీవీలు పెట్టి, కుర్చీలు వేసి చంద్రబాబు స్పీచ్‌లు వినిపించాలని చూసినా.. సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆ స్క్రీన్ల ముందు కూర్చోవడానికి ఆసక్తి చూపలేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మహానాడు ద్వారా టీడీపీకి ప్రజల్లోనే కాదు, సొంత క్యాడర్‌లోనూ ఆదరణ తగ్గిందనే విషయం మళ్లీ నిరూపితమైందని రోజా స్పష్టం చేశారు.

ANN TOP 10