దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతిభద్రతలను పరిరక్షించటానికి జాతీయ భద్రతా చట్టం కింద దిల్లీ పోలీస్ కమిషనర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఈ అంశంపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. నిరసనకారులను అణిచివేయడానికే ఈ పోలీసులకు ఈ ప్రత్యేక అధికారులు ఇచ్చారాన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ప్రతీ 3 నెలలకు ఒకసారి జరిగే సాధారణ పునరుద్ధరణ ప్రక్రియ అని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుత ఉత్తర్వులకు.. సీజేపీ నిరసనలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు.
చట్టం ఏం చెబుతోంది..
జాతీయ భద్రతా చట్టం.. దేశ రక్షణ, విదేశీ సంబంధాలు, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులను అదుపులోకి తీసుకోవటానికి పోలీసులకు అధికారాలను కల్పిస్తుంది. నేరం చేసినప్పుడే కాకుండా భవిష్యత్తులో అలాంటి నేరాలు జరగకుండా నివారించటానికి ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. 1980 డిసెంబర్ 27న పార్లమెంట్ ఆమోదంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తిని ఎలాంటి అభియోగాలు లేకుండా 12 నెలలపాటు నిర్భంధంలో పెట్టవచ్చు. ప్రధానంగా దేశ భద్రతకు భంగం కలిగించటం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించటం.. అత్యవసర సేవలకు ఆటంకం కలిగిస్తే ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.
నిరసనలను అణిచివేసేందుకేనా?
అయితే దిల్లీలో కాక్రోచ్ పార్టీ, ఇతర పక్షాలు చేస్తున్న నిరసనలను అణిచి వేయటానికే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని ప్రతిపక్ష పార్టీలు, ఆందోళనాకారులు ఆరోపిస్తున్నారు. దాంతో దిల్లీ పోలీసులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసనలను అణచివేసేందుకే దిల్లీ పోలీస్ కమిషనర్ కు ఈ అధికారాలు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇది రొటీన్ పరిపాలనా ప్రక్రియ అని తెలిపారు. ఇంతకు ముందే అమల్లో ఉన్న దానిని జులై 19 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు పునరుద్దరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులని వారు స్పష్టతనిస్తున్నారు.








