ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లో బీఆర్ఎస్వీ నిరసన చేపట్టనుంది. దీంట్లో తాను స్వయంగా పాల్గొంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయలేరని అన్నారు.
ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్టు చేసిన కేటీఆర్.. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్లో జరిగే బీఆర్ఎస్వీ ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు చర్యలకు నిరసనగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని పేర్కొన్నారు.
దేశ యువత గొంతును బలవంతంగా అణచివేయడం సాధ్యం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే విద్యార్థులు, యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొని మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.








