కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కూర్చోబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీలో కీలక నేతల మధ్య సుదీర్ఘ చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల హడావుడి
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరితో విడివిడిగా సమావేశమైనట్లు సమాచారం. 2028 ఎన్నికల లోపు ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని దెబ్బతీయకుండా చూడాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు టాక్. డీకే శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని ప్రియాంకా గాంధీ గట్టిగా పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాబోయే 72 గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఊహాగానాలు సహజమేనని సిద్ధరామయ్య కొట్టిపారేయగా మంచి రోజులు వస్తాయని డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
మార్పునకు కారణాలు
సిద్ధరామయ్య వయస్సు 2028 నాటికి 80 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రభుత్వ పాలనపై అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతోందని సర్వేలు చెబుతున్నట్లు టాక్ నడుస్తోంది. సిద్ధరామయ్యకు అహిందా (వెనుకబడిన, దళిత, మైనారిటీ) వర్గాల మద్దతు బలంగా ఉంది. అందుకే ఆయన్ను నొప్పించకుండా రాజ్యసభ సీటు ఇచ్చి కుమారుడికి మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
డీకే శివకుమార్కు ఉన్న బలాలు
డీకే శివకుమార్కు వొక్కలిగ సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. ఆయన్ను సీఎం చేస్తే జేడీఎస్, బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయొచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా రెండు కీలక పదవుల్లో ఉన్నారు. అయితే ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే ప్రమాదం కూడా ఉందనే చర్చ నడుస్తోంది.








