AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజా సేవలకు పాత రూల్స్..! సీఎం చంద్రబాబు ఆదేశం కీలక నిర్ణయం..

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందేలా చూడాలని, ఇందుకు అవసరమైతే ‘బిజినెస్ రూల్స్’ సవరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు, పాత నిబంధనల పేరుతో అనవసర జాప్యం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ), వివిధ శాఖల కార్యక్రమాల అమలుపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా అవసరమైన మార్పులు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “రోటీన్ పద్ధతుల్లో పనిచేసే విధానానికి కాలం చెల్లింది. అధికారులు, ఉద్యోగులు వినూత్నంగా ఆలోచించి, ప్రజలకు సేవలను ఎలా సులభతరం చేయాలో చూడాలి. కేవలం పనిచేయడమే కాదు, క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు చూపించడం కూడా అంతే ముఖ్యం” అని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, సేవలపై క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని, దాని ఆధారంగానే అధికారుల పనితీరును అంచనా వేయాలని చెప్పారు.

 

“బాగా పనిచేసే అధికారులను అభినందిద్దాం, పనితీరు సరిగా లేని వారికి ఓరియెంటేషన్ తరగతులు నిర్వహిద్దాం” అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ప్రణాళికా శాఖ నుంచి నియమించిన నోడల్ అధికారుల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆదేశించారు.

 

రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. “ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే కొంత సమయం గడిచింది. ఇంకా పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టండి” అని ఆదేశించారు. ముఖ్యంగా కుటుంబ తగాదాల కారణంగా ఉత్పన్నమయ్యే రెవెన్యూ వివాదాల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, గొడవల వల్ల కలిగే నష్టాలను వివరించి, వారిని ఒప్పించాలని సూచించారు. మానవీయ కోణంలో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

 

అదేవిధంగా, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వాటిని ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖలు తమ పూర్తి సమాచారాన్ని ఆర్టీజీఎస్‌కు అందించాలని, సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని నియమించాలని సీఎం సూచించారు. అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లో వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.

 

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ANN TOP 10