AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పళనిస్వామికి బిగ్ షాక్.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా..!

తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అంతర్గత సంక్షోభంతో అల్లాడుతున్న మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీకి తాజాగా ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తూ.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కు సమర్పించారు.

 

తిరుగుబాటు బృందంలో..

ఇటీవల అన్నాడీఎంకే సీనియర్ నేత సి.వి షణ్ముగం నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఆ తిరుగుబాటు బృందంలోని వారు కావడం గమనార్హం. కుమార వేల్.. ‘మదురాంతకం నియోజకవర్గం’ నుంచి, సత్యభామ ‘ధారపురం’ నుంచి, జయకుమార్ ‘పెరుందరై’ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వారు అన్నాడీఎంకే టికెట్లపై విజయం సాధించారు.

 

టీవీకే తరుపున బరిలో..

తమ పదవులకు రాజీనామాను సమర్పించిన అనంతరం వారు టీవీకే మంత్రి ఆదవ్ అర్జున్ ను ఆయన ఛాంబర్ లో కలిశారు. తమ మద్దతును టీవీకే పార్టీకి అధికారికంగా తెలియజేశారు. ఇకపై తమ రాజకీయ ప్రయాణం టీవీకే పార్టీతోనే అన్న సంకేతాలను ఈ ముగ్గురు నేతలు ఇచ్చారు. వీరి రాజీనామాను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఆమోదిస్తే.. త్వరలోనే వారి స్థానాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం విజయ్ తన రెండో ఎమ్మెల్యే స్థానమైన ‘తిరుచ్చి ఈస్ట్’ స్థానానికి రాజీనామా చేశారు. త్వరలోనే ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. తాజాగా ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ తో పాటు ఆ మూడు స్థానాలకు కూడా ఉపఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రాజీనామా చేసిన కుమారవేల్, జయకుమార్, సత్యభామ.. టీవీకే పార్టీ తరపున బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

 

అన్నాడీఎంకేలో సంక్షోభం

ఇటీవల టీవీకే ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు.. విజయ్ సర్కార్ కు మద్దతు ప్రకటించారు. అయితే వీరిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు.. కొద్దిరోజుల క్రితం తిరిగి పళనిస్వామి శిబిరానికి తిరిగి వెళ్లిపోయారు. దీంతో విజయ్ కు లభించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు 25 నుంచి 17కి తగ్గినట్లైంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి నేతృత్వలోని అన్నా డీఎంకే పార్టీ 47 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఎవరు ఉంటారో, ఎవరు పార్టీని వీడతారో తెలియక సంక్షోభంలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు సీఎం విజయ్ కి చెందిన టీవీకే పార్టీ ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, వామపక్షాలు, అన్నాడీఎంకే (వేర్పాటు వర్గం) మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ANN TOP 10