రాజమౌళి సినిమాల్లో పురాణాల ప్రభావం ఎంతలా ఉంటుందో మనకు తెలిసిందే. ‘బాహుబలి’లో శివుడి ప్రస్తావన, ‘RRR’ క్లైమాక్స్లో రాముడి గెటప్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. అయితే ఈసారి ఏకంగా ‘వారణాసి’ చిత్రంలో రామాయణం ఆధారంగా ఒక భారీ ఎపిసోడ్ను ప్లాన్ చేశారు జక్కన్న. సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న వార్తలు అక్షరాలా నిజం, కాకపోతే చిన్న కరెక్షన్ ఇది 15 నిమిషాలు కాదు, ఏకంగా 25 నిమిషాల నిడివి గల ఒక మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్!
60 రోజుల కఠోర శ్రమ
ఇంటర్నేషనల్ మీడియా టాక్ షోలలో రాజమౌళి స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం… ఈ 25 నిమిషాల ఎపిసోడ్ కోసం చిత్రయూనిట్ ఏకంగా 60 రోజుల పాటు నాన్స్టాప్గా షూటింగ్ చేసింది. రామాయణంలోని కొన్ని ఎపిసోడ్స్ సమాహారంగా ఈ ఎపిసోడ్ సాగుతుంది. ఇందులో వచ్చే ప్రతీ సబ్ ఎపిసోడ్ ఒక చిన్న సినిమా తీసినంత కష్టంతో కూడుకున్నదని, సాంకేతికంగా సరికొత్త సవాళ్లను ఎదుర్కొని దీనిని స్క్రీన్ పైకి తెస్తున్నామని ఆయన చెప్పారు.
గూస్బంప్స్ తెప్పించిన..
రాజమౌళి ఈ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “మొదటి రోజు మహేష్ బాబు లార్డ్ రామ గెటప్లో ఫోటోషూట్ కోసం సెట్లోకి అడుగుపెట్టినప్పుడు నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. మహేష్లో కృష్ణుడికి ఉండే చార్మ్, అలాగే రాముడికి ఉండే ప్రశాంతత రెండూ ఉన్నాయి. ఆ లుక్ చూశాక నా ఫోన్ వాల్పేపర్గా కూడా అదే ఫోటో పెట్టుకున్నాను.”
మహేష్ బాబు కూడా ఈ పాత్ర గురించి మాట్లాడుతూ… పౌరాణిక పాత్రలు చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్, పోశ్చర్ చాలా ప్రత్యేకంగా ఉండాలని, మోడరన్ సినిమాల్లా క్యాజువల్గా ఉండటానికి వీల్లేదని, ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారికి మహేష్ను ఒక పౌరాణిక పాత్రలో చూడాలనేది పెద్ద కోరిక అని, ఈ సినిమాతో ఆ కల నెరవేరుతోందని మహేష్ ఎమోషనల్ అయ్యారు.
సరికొత్త టెక్నాలజీ!
ఈ 25 నిమిషాల విజువల్ వండర్ కోసం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో సరికొత్తగా ఏర్పాటు చేసిన భారతదేశపు అతిపెద్ద మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీని ఉపయోగించారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం 36 అడుగుల ఎత్తున్న ప్రత్యేకమైన స్టేజ్ను కస్టమైజ్ చేయించి మరీ ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సమక్షంలో ఈ సీక్వెన్స్ను షూట్ చేశారు. టైమ్ ట్రావెల్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే అడ్వెంచరర్ పాత్రతో పాటు ఈ లార్డ్ రామా అవతారంలోనూ కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రాజమౌళి కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ సీక్వెన్స్గా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.







