గ్లోబల్ టెక్ – ట్రావెల్ క్లస్టర్ గా హైదరాబాద్ ను తీర్చి దిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా ఈ రంగ దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా ఒక పటిష్ఠమైన ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్’ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ను బుధవారం ప్రారంభించి మాట్లాడారు.
విమానయానం, స్పేస్-టెక్, డిఫెన్స్, డీప్-టెక్ తదితర రంగాల్లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందన్నారు. గత రెండేళ్ల వ్యవధిలో వ్యాన్గార్డ్, మారియట్ ఇంటర్నేషనల్, హెచ్సీఏ హెల్త్ కేర్, హార్ట్ ఫోర్డ్, బీఏఎస్ఎఫ్ తదితర ఎన్నో దిగ్గజ సంస్థలు హైదరాబాద్ ను తమ గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు. ఈ జాబితాలో ‘సౌత్ వెస్ట్ ఎయిర్స్ లైన్స్’ కూడా చేరడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేలా నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.
ఆర్ అండ్ డీ, స్కిల్లింగ్, ఇన్నోవేషన్ తదితర అంశాల్లో దిగ్గజ సంస్థలతో కలిసి పని చేసేందుకు ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ‘సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్’కు ఒక స్ట్రాటెజిక్ హబ్ గా పని చేయనుందని వెల్లడించారు. కంపెనీ గ్లోబల్ నెట్ వర్క్, సపోర్టింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఎంటర్ ప్రైజ్ కేపబిలిటీస్ తదితర అంశాల్లో కీలక సేవలు అందించనుందని, డీప్ టెక్, ఏఐ,ఎంఎల్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రైజ్ ప్లాట్ ఫామ్స్ తదితర విభాగాల్లో నిపుణులైన 1000మందికి ఉపాధి లభించనుందన్నారు. విమానయాన రంగంలో హైదరాబాద్ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం కానుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇండియా కృష్ణ కల్లెపల్లి, ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.








