ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపుపై ఫోకస్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే తన కాన్వాయ్లోని సగానికి పైగా వాహనాలను తగ్గించుకున్న సీఎం చంద్రబాబు, తాజాగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ విధానాన్ని పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే
ఇరాన్పై అమెరికా యుద్ధం చేయలేదు. కాకపోతే మార్చి నెలలో జరిగిన పరిణామాలు, మరోవైపు ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్భంధనం చేయడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా సూచించారు.
ముఖ్యంగా బంగారం కొనుగోలు, ఇంధనం పొదుపు, వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ఆయన సూచనలు చేశారు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ విధానం తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ సూచనల తర్వాత ఏపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.
వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు
వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగంలో అమలు చేస్తామని చెప్పకనే చెప్పారు. కాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చొని పని చేసే పరిస్థితి రానున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. దీనివల్ల అనవసర ప్రయాణాలు తగ్గుతాయని, టెలి-వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉందంటున్నాయి. ఈ క్రమంలో ఇంటి నుంచి పని చేసేవారు.. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలుగా విభజించే అవకాశం ఉందంటున్నారు.
అలా కాని పక్షంలో వర్క్ ఫ్రం హోమ్తో పాటు హైబ్రిడ్ విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. అంటే వారంలో మూడు రోజులు ఆఫీసు, మూడు రోజులు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని పరిశీలన చేస్తున్నారట. గురువారం జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి వెంటనే ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నాయి.









