రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వారానికి ఒక రోజు తప్పనిసరిగా ‘నో వెహికిల్ డే’ అమలు చేయాలని నిర్ణయించింది. మంత్రులు-వీవీఐపీలు సొంత కార్లను పక్కనపెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.
చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశమైంది. 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం, ఆపై ఆదేశాలు జారీ చేశారు. ఇకపై రాష్ట్రంలో వారానికి ఒక రోజు తప్పనిసరిగా ‘నో వెహికిల్ డే’ అమలు చేయాలని నిర్ణయించింది. మంత్రులు, వీవీఐపీలు తమ కార్లను పక్కనపెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేయాలని నిర్ణయించింది.
లేకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు, అవి లేకుంటే సైకిళ్లను వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికితోడు జిల్లా పర్యటనల్లో ప్రజాప్రతినిధులు పొదుపు చర్యలు పాటించాల్సిందేనని డిసైడ్ అయ్యింది. నాదేశం- నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినేట్ తీర్మానించింది. కొన్నాళ్లపాటు మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు చేసినట్టు సమాచారం.
పొదుపు ఫార్ములా, వారానికి ఒకరోజు ‘నో వెహికిల్ డే’
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన సొంత కాన్వాయ్లో 50 శాతం వాహనాలను తగ్గించుకున్నారు. ఈ విధానాన్ని అన్ని స్థాయిల్లో నాయకులు ఆచరణలో పెట్టాలన్నారు. వీలున్న శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అంశంపైనా మంత్రి వర్గం చర్చించింది.
భారీ పెట్టుబడులు ఆకర్షించేలా మంత్రి వర్గం పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. విశాఖలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం 854 ఎకరాల భూమిని కేటాయించింది. దేశంలో అతిపెద్ద డేటా సెంటర్గా ఈ ప్రాజెక్టు నిలవనుంది. దీనికితోడు శ్రీ సత్యసాయి జిల్లాలో బ్యాటరీ స్టోరేజ్ సదుపాయం ఉండేలా రిలయన్స్ మెగా సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్కు ఆమోదం తెలిపింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరులో అపోలో టైర్స్ విస్తరణ, నెల్లూరులో భారీ ఎంజైమ్ తయారీ కేంద్రం, ఓర్వకల్ సోలార్ సెల్ తయారీ యూనిట్కు అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజకీయ పార్టీల ఆఫీసులకు ఇచ్చే భూముల లీజు గడువును పెంచే విషయమై చర్చించారు. ఇదిలాఉండగా నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ, విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ బాధితుల కేసుల విచారణను వేగం చేసి వారికి న్యాయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది.
కేబినెట్ సమావేశానికి కొందరు ఐఏఎస్ అధికారులు ఆలస్యంగా రావడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఉన్నా సమయ పాలన పాటించకపోవడంపై మండిపడ్డారట. ఆలస్యంగా వచ్చిన వారి పేర్లను నోట్ చేయాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. క్రమశిక్షణ తప్పనిసరని అధికారులను హెచ్చరించారట సీఎం.









