రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేరాల కట్టడికి పటిష్ఠమైన యాక్షన్ ప్లాన్ రూపొందించడమే లక్ష్యంగా సచివాలయంలో బుధవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత, వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలోని సైబర్ నేరాల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో సైబర్, ఆర్థిక నేరాలకు సంబంధించి ‘1930’ టోల్ ఫ్రీ నెంబర్కు బాధితుల నుంచి ఏకంగా 9.29 లక్షల ఫిర్యాదులు అందాయని, ఇది సమస్య తీవ్రతకు అద్దం పడుతోందని తెలిపారు. ఇప్పటివరకు బాధితులు సుమారు రూ.652 కోట్ల మేర నగదును కోల్పోయారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలే (ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్) అతిపెద్ద ఆర్థిక నేరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు ఫిషింగ్, విషింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు మోసాలు, ఆన్లైన్ లోన్ ఫ్రాడ్స్, ‘డిజిటల్ అరెస్ట్’ వంటి కొత్త తరహా మోసాలతో ప్రజలు నిలువునా దోపిడీకి గురవుతున్నారని వివరించారు.
అయితే, సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం, బ్యాంకర్లతో కలిసి సమర్థవంతంగా పనిచేస్తూ రూ.116 కోట్లకు పైగా మొత్తాన్ని నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా నిలువరించగలిగామని అధికారులు చెప్పడం కొంత ఊరటనిచ్చింది. ‘గోల్డెన్ అవర్’లో తక్షణమే స్పందించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీస్ యంత్రాంగం, బ్యాంకర్ల మధ్య మరింత దృఢమైన సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఒక సమగ్ర ‘ఏపీ సైబర్ పాలసీ’ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర స్థాయిలో సీఐడీ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ ఫోరెన్సిక్స్ సలహాదారు కేపీసీ గాంధీ, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాలుపంచుకుని తమ అభిప్రాయాలను పంచుకున్నారు








