AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండి భగీరథ్ కేసులో తగ్గేదేలే.. రాజకీయ ఒత్తిళ్లకు తావులేదు, సైబరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు..

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగుతోంది. చట్టం ముందు అందరూ సమానులేనని.. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పూర్తి పారదర్శకంగా దర్యాప్తు జరుపుతామని సీపీ స్పష్టం చేశారు.

 

బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు పేర్కొన్నారు. భగీరథ్ తన మైనర్ కుమార్తెను ఫామ్‌హౌస్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడని వివరించారు. అక్కడ బాలికకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు ఎంతటి బలమైన వ్యక్తి అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీస్ యంత్రాంగం గట్టిగా చెబుతోంది. సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసే ప్రక్రియను ముమ్మరం చేశారు.

 

ఈ వివాదం మరో మలుపు తిరుగుతూ భగీరథ్ సైతం కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు బాలిక తల్లి తనను హనీట్రాప్ చేసిందని.. తప్పుడు ఆరోపణలతో బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆయన వాదిస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు వైపుల నుంచి ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. అసలు వాస్తవాలు వెలికితీసేందుకు ఫోన్ కాల్ డేటా అలాగే సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.

 

ఈ కేసు తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరగాలని డీజీపీని ఆదేశించారు. విచారణలో ఎక్కడా రాజీ పడకూడదని.. నిజానిజాలను బయట పెట్టాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిట్ రంగంలోకి దిగడంతో దర్యాప్తు వేగవంతం కానుంది. కేంద్రమంత్రి కుమారుడి చుట్టూ ముసురుకున్న ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ANN TOP 10