ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపింది. ఆదివారం (మే 10) హైదరాబాద్లో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హాజరు కావాలని కోరుతూ కేంద్రం శనివారం ఆహ్వాన పత్రం అందజేసింది.
జాతీయ రహదారుల విభాగం రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ స్వయంగా ఈ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం, హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడెబల్లూరు-మహబూబ్నగర్ నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన, కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే పనుల ప్రారంభం వంటివి ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ప్రధాని పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో, ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికి, హెచ్ఐసీసీలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.







