AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజయ్ వద్దే హోం.. 9 మంది మంత్రులతో తొలి కేబినెట్..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త ప్రభుత్వంలో హోం, పోలీస్, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకోనున్నట్లు పార్టీ వర్గాలు శనివారం వెల్లడించాయి.

 

విజయ్‌తో పాటు తొలి విడతలో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. సీనియర్ నేత కె.ఎ. సెంగొట్టయ్యన్‌కు పబ్లిక్ వర్క్స్, ఎన్. ఆనంద్‌కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, సి.టి.ఆర్. నిర్మల్ కుమార్‌కు విద్యుత్ శాఖ, ఆదావ్ అర్జునకు క్రీడల అభివృద్ధి శాఖ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వి.ఎన్.ఎస్. ముస్తఫాకు మైనారిటీ సంక్షేమం, అరుణ్ రాజ్‌కు వాణిజ్య పన్నుల శాఖలు కేటాయించే అవకాశం ఉంది.

 

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా మెజారిటీ మార్కును (118) అందుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతుతో విజయ్ కూటమి బలం 120కి చేరింది. మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు సమర్పించడంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన విజయ్‌ను ఆహ్వానించారు.

 

ప్రభుత్వం ఏర్పడిన తొలి దశలోనే పాలన, శాంతిభద్రతలపై పూర్తి పట్టు సాధించాలనే ఉద్దేశంతోనే విజయ్ కీలకమైన హోం శాఖను తన వద్దే ఉంచుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ANN TOP 10