కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హనీట్రాప్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హానీ ట్రాప్, బ్రాక్ మెయిల్ ఆరోపణలతో కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో భగీరథ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా కేంద్ర మంత్రి కుమారుడ్నే హానీ ట్రాప్ పేరుతో టార్గెట్ చేయడం రాజకీయంగా, సామాజికంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను తప్పుడు మార్గంలో ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తోందని పేర్కొన్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఒక యువతితో తనకు స్నేహం ఉందని.. ఆ సాన్నిహిత్యంతోనే ఆమె కుటుంబ సభ్యులు తనను వివిధ వేడుకలకు, పార్టీలకు ఆహ్వానించేవారని భగీరథ్ ఫిర్యాదులో తెలిపారు.
అయితే తామిద్దరం కలిసి పలు ఆలయాలను కూడా సందర్శించామని, అయితే ఇప్పుడు ఆ యువతిని వివాహం చేసుకోవాలని లేదా రూ. 5 కోట్లు నగదు ఇవ్వాలని ఆ కుటుంబం తనపై ఒత్తిడి తెస్తోందని భగీరథ్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే ఆ యువతి తండ్రికి రూ. 50 వేలు చెల్లించానని, అయినప్పటికీ తమ వద్ద ఉన్న వ్యక్తిగత వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లను బయటపెడతామని బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







