టెక్ యుగానికి సంబంధించిన కంపెనీలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఒకొక్క కంపెనీలు రావడం మొదలుపెట్టాయి. మరో ఐదేళ్లులో ఏపీ పేరు బలంగా వినిపించాలని ఆలోచన చేస్తోంది. తాజాగా ఏపీకి మరొక భారీ పెట్టుబడి రాబోతోంది. లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఏపీకి మరొక భారీ పెట్టుబడి.. రూ.8,175 కోట్ల పెట్టుబడి వారీ ఎనర్జీ సంస్థ
రాబోయే కాలానికి కావాల్సిన పరిశ్రమలను ఏపీకి రప్పించేందుకు చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. ఓ వైపు ఐటీ కంపెనీలు, ఇంకోవైపు భారీ పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కొన్నాళ్లుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు భారీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తాజాగా మరొక పరిశ్రమ రాబోతోంది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాదాపు రూ.8,175 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 16 గిగావాట్ లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. అందులో సెల్, ప్యాక్, విద్యుత్ స్టోరేజ్కు అవసరమైన బ్యాటరీలను తయారు చేయనుంది.
అనకాపల్లి జిల్లాలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు
ఒకేచోట సెల్, ప్యాక్ తయారీ, ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. మొదటి దశ వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేయాలన్నది ఆ కంపెనీ ప్రధాన లక్ష్యం. దీనిద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించనుంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 300 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించింది.
వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన తమ ఉత్పత్తులను అమెరికా, కెనడా, ఇటలీ, తుర్కీ, వియత్నాంతో పాటు 30 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే గుజరాత్, టెక్సాస్లో 14.9 గిగావాట్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమేకాదు, వేగంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.








