AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే భారీ కుట్ర భగ్నం: అమిత్ షా..

పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ‘షాజాద్ భట్టి నెట్‌వర్క్’ అనే ఉగ్రవాద ముఠాను పూర్తిగా నిర్మూలించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే దేశంలో విధ్వంసక దాడులు చేసేందుకు పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయని, ఈ క్రమంలో 14 రాష్ట్రాల్లో 200 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఈ మేరకు అమిత్ షా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వివరాలను వెల్లడించారు. భద్రతా బలగాలు సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్ల ద్వారా ఈ నెట్‌వర్క్‌ను ఛిన్నాభిన్నం చేసినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌‍లలో మొత్తం 253 మందిని అదుపులోకి తీసుకోగా, 200 మందికి పైగా నిందితులను అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 80కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 62 మంది, హర్యానాలో 52, ఢిల్లీలో 51, పంజాబ్‌లో 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఐఈడీలు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ముద్రలు కలిగిన గ్రెనేడ్లు, పిస్టళ్లు, మందుగుండు సామాగ్రితో పాటు గూఢచర్యం కోసం వినియోగించే రహస్య కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

షాజాద్ భట్టి నెట్‌వర్క్, ప్రధానంగా గ్రెనేడ్, ఐఈడీలు, పెట్రోల్ బాంబు దాడులతో పాటు లక్షిత హత్యలకు కుట్ర పన్నుతున్నట్లు అధికారులు వివరించారు. పోలీసు స్టేషన్లు, రక్షణ సంస్థలు, మతపరమైన ప్రదేశాలపై నిఘా ఉంచేందుకు ఈ ముఠా స్థానికులకు భారీగా నగదు చెల్లించిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ANN TOP 10