AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైజాగ్ మెట్రో.. ప్రైవేట్ భూసేకరణకు సర్వం సిద్ధం..

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూసేకరణ కీలక మైలురాయిగా నిలిచింది. ఇందుకు అవసరమైన సుమారు రూ. 600 కోట్ల నిధులను విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిధులు అందిన వెంటనే భూ యజమానులకు పరిహారం చెల్లించి నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

 

మొత్తం రూ. 11,498 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ అత్యంత కీలకం. నిధులు విడుదల అయిన వెంటనే భూసేకరణకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఏడాది ఆఖరులోనే నిర్మాణ పనులను ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భూసేకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసేందుకు ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

 

తొలి దశ ప్రాజెక్టు కోసం మొత్తం 99.11 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇందులో 90 శాతానికి పైగా భూమి ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మిగిలిన 7.57 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రైవేటు స్థలాలు తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్నాయి. థాటిచెట్లపాలెం – చిన వాల్తేరు కారిడార్ వంటి ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణం కోసం ఈ భూమి తప్పనిసరిగా మారింది.

 

ప్రైవేటు భూ యజమానులకు ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం తగిన పరిహారం అందించనున్నారు. నిపుణుల కమిటీ ఈ పరిహార ప్యాకేజీని త్వరలోనే ఖరారు చేస్తుంది. పారదర్శకమైన విధానంలో చెల్లింపులు జరపడం వల్ల పనులు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.పి. రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

 

సాంకేతిక పరంగా కూడా ఈ ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారి-16 వెంబడి డబుల్ డెక్కర్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి సాంకేతిక బృందాలు ద్వితీయ సర్వే నిర్వహిస్తున్నాయి. దీని ప్రకారం పై అంతస్తులో మెట్రో రైళ్లు నడుస్తాయి. మధ్య అంతస్తులో వాహనాల కోసం ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ న్యూ డిజైన్‌తో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి పంపనుంది.

 

ఈ మెట్రో ప్రాజెక్టు వైజాగ్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేయనుంది. ప్రధానంగా నగరంలోని 12 ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న ట్రాఫిక్ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుంది. భవిష్యత్తులో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ మెట్రో మార్గాన్ని అనుసంధానం చేయనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి మెట్రో ప్రాజెక్టు దోహదపడనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల చేసిన వెంటనే ప్రాజెక్టు పనులు షురూ కానున్నాయి.

ANN TOP 10