ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు, జడ్పీటీసీ సభ్యుడు కోనేటి సుమన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లపై బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. తమకు జరిగిన అవమానాలను భరించలేమని, ఎన్నికల్లో తాము ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని సంచలన సవాలు విసిరారు. ఈ పరిణామాలను వైసీపీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టింది.
కోనేటి సుమన్ మీడియా ముందకు వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన సత్యవేడులో ఒక దళిత ఎమ్మెల్యేకు కనీస గౌరవం ఇవ్వకుండా, అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులను ఇంచార్జీలుగా పెట్టి తమను అణిచివేస్తున్నారని ఆరోపించారు. “రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయమా?” అని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యల నెపంతో తన తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక కుట్ర ఉందని, వెన్నుపోటు రాజకీయాలతో తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే పదవి కంటే తమ ఆత్మగౌరవమే ముఖ్యమని కోనేటి సుమన్ స్పష్టం చేశారు. “మేము అప్పులు తెచ్చి, మా సొంత ఆర్థిక బలంతో ఎన్నికల్లో ఖర్చు చేశాం. ఆ అమౌంట్ ఎంతో గంగా ప్రసాద్కు, చంద్రబాబుకు, లోకేష్కు బాగా తెలుసు. ఒక వారం రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తే, నా తండ్రి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు.” అని సవాలు విసిరారు. విలువ లేని చోట, గౌరవం లేని పదవిలో తాము కొనసాగలేమని ఆయన తేల్చి చెప్పారు. దళిత నియోజకవర్గంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తనం చలాయించడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్యవేడు నియోజకవర్గంలో దోపిడీ పరాకాష్టకు చేరిందని ఆదిమూలం కుటుంబం ఆరోపించింది. ప్రతిరోజూ 50 నుండి 60 ట్రాక్టర్ల ఇసుక, లారీల్లో గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా తమిళనాడుకు తరలిపోతోందని వారు వెల్లడించారు. ఈ అక్రమ రవాణా ద్వారా వచ్చే కోట్లాది రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని వారు ప్రశ్నించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే హోదాలో ఉన్న తన తండ్రి జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటే, కూటమి ప్రభుత్వంలో ఒక దళిత ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.
వైసీపీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని విమర్శిస్తోంది. హోటల్ గదిలో రాసలీలలు సాగించారనే ఆరోపణలు కూడా ఉద్దేశపూర్వకంగా చేసినవేనని, తమను రాజకీయంగా సమాధి చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని కోనేటి వర్గీయులు వాదిస్తున్నారు. తిరుపతి జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ఈ సవాలుపై ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.








