బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన భార్య శాలినిరెడ్డిలను సీఐడీ అధికారులు విచారించారు. హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. జనవరి 29న హుజూరాబాద్లో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మతవిద్వేష వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈ విచారణ జరిగింది.
సీఐడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను ఏదైనా తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటాను. కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తే లొంగిపోయే ప్రసక్తే లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని… ఇప్పుడు పెట్టిన కేసులన్నీ అప్పుడు తిరగబడతాయని అధికారులను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. రాజకీయ కక్షతోనే తన భార్యకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.








