AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టమైన ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా నమోదైన పాత కేసుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.

 

2011లో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు తాము శాంతియుతంగా నిరసన తెలిపామని, అయితే అప్పటి ప్రభుత్వం రాజకీయ కారణాలతో తమపై అక్రమ కేసులు నమోదు చేసిందని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దశాబ్ద కాలం గడిచినా ఈ కేసుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని తక్షణమే కొట్టివేయాలని వారు న్యాయస్థానాన్ని కోరారు.

 

దీనిపై పూర్తి వివరాలతో కూడిన ‘కౌంటర్’ దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత పోలీసు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అప్పటి ఘటనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలు, ప్రస్తుత కేసు స్థితిగతులను నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

ANN TOP 10