AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాసరకు పోటెత్తిన భక్తులు

చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ముందు, కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసంత పంచమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10