ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు మరియు దానిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తక్షణమే జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రతే అనేక వ్యాధులకు మూలకారణమని పేర్కొన్న సీఎం, ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత చైతన్యం తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
అధికారులు అందించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,592 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి, ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నాయి. అయితే, ఈ వ్యాధి కారణంగానే మరణాలు సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదని, అనుమానిత మరణాలుగా నమోదైన 9 కేసుల్లో ఇతర ఆరోగ్య సమస్యలు/మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే మరణాలు సంభవించినట్లు తేలిందని వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు.
ఈ నివేదికపై స్పందించిన ముఖ్యమంత్రి, స్క్రబ్ టైఫస్ను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఏర్పాటు చేయబడిన ఈ టాస్క్ఫోర్స్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, వ్యాధి వ్యాప్తికి గల కారణాలను విశ్లేషించి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు (డెంగ్యూ 56%, చికున్గున్యా 46.5%, మలేరియా 11%) మొత్తం 48 శాతం తగ్గుముఖం పట్టాయని అధికారులు సమావేశంలో వెల్లడించారు.









