ఎట్టకేలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ గుట్టు బయటపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. చిట్ఫండ్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు అందులో ప్రస్తావించింది. అయితే ఈడీ సోదాల నుంచి ఇప్పటివరకు ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.
విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్కు పాపం పండింది. ఆయన చిట్టాను బయటపెట్టింది ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. ఆయనకు సంబంధించి వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజల నుంచి అక్రమంగా 2 వేల కోట్లు చిట్ ఫండ్ పేరుతో డిపాజిట్లు సేకరించింది. ఈ మేరకు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. డిపాజిట్దారుల నుంచి సేకరించిన డబ్బును పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. పెట్టుబడిదారులు ఆయా నిధులను ఇతర అవసరాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించినట్లు వెల్లడించింది ఈడీ.
సోదాలపై చిట్టా విప్పిన ఈడీ
ఈ కంపెనీ కారణంగా వేలాది మంది పెట్టుబడిదారులు మోసపోయారని వెల్లడించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజల నుంచి భారీగా డిపాజిట్లను సేకరించినట్టు గుర్తించింది. ఆగష్టు 5న విశాఖపట్నం, హైదరాబాద్లలో కంపెనీ ఎండీ మళ్ల విజయప్రసాద్, డైరెక్టర్లు ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో గుర్తించిన ఉల్లంఘనలు, ఇతర అంశాలను వెల్లడించింది. ఈడీ సోదాల్లో రూ.1.01 కోట్ల నగదు, స్థిర, చరాస్తులు సీజ్ చేసింది. నేరపూరిత అంశాలను సూచించే కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, డిజిటిల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. 182 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్టు పేర్కొంది.
అలాగే ఆరు లగ్జరీ కార్లు సీజ్ చేసింది. డిపాజిట్ల సేకరణను దాచిపెట్టేందుకు ఆర్థిక నివేదికలను తారుమారు గుర్తించింది ఈడీ. ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో ఒడిషా, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఏపీ రాష్ట్రాలకు చెందినవారి నుంచి అనధికారికంగా డిపాజిట్లు సేకరించినట్లు వివరించింది. విశాఖపట్నంలో భూములు ఇస్తామన్న హామీతో నిధులను సేకరించింది. ఆ తర్వాత కంపెనీ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆఫీసులను మూసివేసి పెట్టుబడిదారులను మోసగించినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది. భువనేశ్వర్లో ఈడీ, సీబీఐ, ఏసీబీ, ధన్బాద్, ఒడిశా పోలీసులు, వెల్ఫేర్ గ్రూపు ఎండీ, డైరెక్టర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన చార్జిషీట్లు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని స్పష్టంచేసింది.








