AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీ20 వరల్డ్ కప్-2026 బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీమిండియా మాజీ కెప్టెన్ మరియు 2024 టీ20 ప్రపంచకప్ విజేత రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. భారత్ మరియు శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌కు టోర్నమెంట్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2024లో కెప్టెన్‌గా కప్ గెలిపించిన ‘హిట్ మ్యాన్’, ఇప్పుడు కొత్త హోదాలో ఈ మెగా టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు.

ఈ నియామకంపై ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందిస్తూ, “2024 ప్రపంచకప్ విజేత కెప్టెన్, ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ఎడిషన్లలోనూ ఆడిన రోహిత్ శర్మ కంటే ఈ ఈవెంట్‌కు మరో మంచి ప్రతినిధి ఉండరు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో యువ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్, 17 ఏళ్ల తర్వాత 2024లో కెప్టెన్‌గా జట్టుకు కప్ అందించడం విశేషం. 2024 టోర్నీలో ఆస్ట్రేలియాపై 92 పరుగులు, సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై కీలక అర్ధశతకం సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

తన కొత్త బాధ్యతపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. “ఈ టోర్నమెంట్ మళ్లీ భారత్‌లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త హోదాలో టోర్నీతో అనుబంధం ఏర్పరచుకోవడం గొప్ప విషయం” అని ఆయన తెలిపారు. ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు చెబుతూ, వారు భారత ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని రోహిత్ శర్మ కోరుకున్నాడు.

ANN TOP 10