AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యూట్విస్ట్…

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. సీబీఐ ద్వారా ఇంటర్‌ పోల్‌కు రెడ్‌ కార్నర్‌ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. నిందితుల్లో ప్రభాకర్‌రావు కెనడాకు పరారయ్యారు. మరొక నిందితుడు శ్రవణ్‌‌రావు బెల్జియంలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపో మాపో వీరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఫోన్ ట్యాపింగ్ కేసు న్యూట్విస్ట్

 

తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ రావు జాడ తెలియరాలేదు. వీరిని పోలీసులు విచారిస్తే ఈ కేసుకు ముగింపు దశకు రానుంది. కాకపోతే వీరిద్దరు విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా వీరిద్దరి గుట్టు రట్టయినట్టు తెలుస్తోంది.

 

ఇంటర్ పోల్‌కు చేరిన నోటీసులు

 

ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన ఆధారాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. దీంతో దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంటర్‌ పోల్‌ కు తెలిపింది. దీంతో సీబీఐ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు పత్రాలు ఇంటర్‌ పోల్‌కు వెళ్లాయి.

 

పరారైన ఇద్దరు నిందితులు

 

ఈ కేసు గురించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిందితులు తమ వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇద్దరి నిందితుల చుట్టూ ఉచ్చు బిగిస్తుందని తెలుసుకున్న వీరు, అమెరికా నుంచి మకాం మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా నుంచి ప్రభాకర్‌రావు కెనడాకు వెళ్లినట్టు తెలుస్తోంది. మరొక నిందితుడు అమెరికా నుంచి శ్రవణ్‌‌రావు బెల్జియం వెళ్లినట్టు పోలీసుల వర్గాల సమాచారం.

 

ఇమ్మిగ్రేషన్ అధికారులు అలర్ట్?

 

సీబీఐ పంపిన రెడ్ కార్నర్ నోటీసులను ఇంటర్‌ పోల్ అధికారులు పరిశీలించారు. ఎందుకంటే ఇంటర్‌పోల్ ఏజెన్సీ ప్రతినిధులు 196 దేశాల ఇమ్మిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేశారు. సీబీఐ అందించిన వివరాలను ఇంటర్ పోల్ అధికారులు వాటిని ఆయా ఆదేశాలను పంపినట్టు సమాచారం.

 

నిందితులు ఏ దేశం పౌరసత్వం ఉన్నప్పటికీ, వారిని అరెస్టు చేసి విచారించే అధికారం ఇంటర్‌పోల్‌కు ఉందని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. ఇంటర్‌ పోల్‌ నుంచి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయితే వీరిద్దర్నీ ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు.

 

ఏడాది తర్వాత కొలిక్కి

 

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులు. హైదరాబాద్ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఏదో ఒక కుంటి సాకు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. అనారోగ్యం వల్ల అమెరికాలో ఉంటున్నానని మొన్నటివరకు సాకులు చెప్పారు ప్రభాకర్‌రావు. ఇక శ్రవణ్‌రావు అయితే అమెరికా నుంచి దుబాయ్‌కి చక్కర్లు కొడుతున్నట్లు ఆ మధ్య కొందరు రాజకీయ నేతలు ఓ‌పెన్‌గా చెప్పుకొచ్చారు. వీరు చిక్కితే ట్యాపింగ్ కేసు లోగుట్టు బయటపడడం ఖాయమన్నమాట.

ANN TOP 10