AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీవన్‌రెడ్డి అనుచరుడి హత్య కేసులో నిందితుడికి రిమాండ్‌

జగిత్యాలలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్‌లో ఈ నెల 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళుతున్న గంగారెడ్డిని అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్‌ కారుతో ఢీకొట్టి కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ కేసు జగిత్యాలలో సంచలనం సృష్టించగా.. జగిత్యాల రాజకీయాల్లో అలజడి రేగింది. హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాదాపు 3 గంటల పాటు జగిత్యాల పాత బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడి వెనుక ఎవరైనా ఉండి ఉంటారని, రాజకీయ హత్యగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఎట్టకేలకు నిందితుడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

హత్యకుగల కారణాలను పరిశీలిస్తే… సంతోష్‌ కుటుంబానికి సంబందించిన భూ వివాదాల్లో గంగారెడ్డి తలదూర్చుతున్నాడని గతం నుంచి సంతోష్‌కు కోపం ఉంది. 2020లో సంతోష్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టించింది కూడా గంగారెడ్డేనని కోపంతో ఉన్న సంతోష్‌ 15 రోజుల క్రితం కేసు రాజీకోసం గంగారెడ్డితో మాట్లాడాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కసిపెంచుకున్న సంతోష్‌ పథకం ప్రకారం గంగారెడ్డిని హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.

ANN TOP 10