మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాలోని నదుల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో పర్యటించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డిల బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న పొంగులేటి, పొన్నం, ప్రభుత్వ సలహదారుడు నరేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యదయ్యల బృందానికి గ్రంథాలయ సంస్థ చెర్మన్ మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రవిలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పలు నదుల సందర్శన..
కొరియా నగరం సియోల్ లోని చియంగ్ చూ నది, హాన్ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్లను వారు సందర్శించారు. సియోల్లో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హాన్ నది సియోల్ నగరంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఇంచియాన్ నగరంలోని స్మార్ట్ సిటీలను, ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన డీమిలిటరైజేషన్ జోన్ (డీఎంజే) వద్ద పర్యటించారు. సియోల్ నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మాపో ప్లాంట్ ను సందర్శించారు.









