ప్రముఖ వచన కవి, కథకుడు, రచయిత జూకంటి జగన్నాథానికి మరో అరుదైన పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కవి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2024ను ప్రకటించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతి యేటా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును ప్రకటిస్తున్నది. ఈ ఏడాదికి గాను దాశరథి కృష్ణమాచార్య అవార్డును జూకంటి జగన్నాథానికి ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ అవార్డుతో రూ. లక్షా 1,116 రూపాయల నగదు, జ్ఞాపికను జూకంటికి అందిస్తారు. ప్రతిష్టాత్మక శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును పొందనున్న జూకంటి జగన్నాథంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో జూకంటి జగన్నాథం జన్మించారు. ఆయన కలం నుంచి జాలువారిన వచన కవితలు ఎందరో పాఠకులను రంజింపచేశాయి. ప్రధానంగా ఆయన కవితలు సాటి మనిషి గురించి, మట్టి మనిషి గురించి ఉండటంతో ఎక్కువ మందిని ఆకట్టుకున్నాయి.
కవిగా, రచయితగా జూకంటి జగన్నాథం ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. సృజనాత్మక ప్రక్రియలకు తెలుగు విశ్వవిద్యాలయం 2002లో యూనివర్సిటీ ట్రస్టీ అవార్డును బహూకరించింది. సాదరంగా సన్మానించింది. ఇటీవలే 2020 సంవత్సరానికి గాను ఆయన జాతీయ అవార్డు గ్రహీత సినారె పురస్కారాన్ని కూడా స్వీకరించారు. 2007 నుంచి 2013 వరకు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా జూకంటి వ్యవహరించారు. సుమారు 16 కవిత్వ సంకలనాలను రచించారు. 2005లో జూకంటి కథలు, మొదటి కవిత్వ సంకలనం పాతాళ గంగను 1993లో రచించారు. 2020లో సద్దిముల్లె అనే కవిత్వ సంకలనాన్ని వెలువరించారు. ఇవి సాహితీ ప్రియులను, సాధారణ ప్రజలనూ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆయన రచనలు పాఠకులను రంజింపజూస్తూనే ఉన్నాయి. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంపై సాహితీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









