AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాసర సరస్వతిదేవి ఆలయంలో అర్ధరాత్రి చోరీ..

తెలంగాణలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయం తలుపులు పగలగొట్టిన దొంగలు వెండి కిరీటం, హుండీని ఎత్తుకుపోయారు. రాత్రి విధుల్లో ఆరుగురు ఉద్యోగులున్నా, చోరీ జరగడంతో అనుమానాలు మొదలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు.

బాసర సరస్వతిదేవి ఆలయంలో అర్ధరాత్రి చోరీ

బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని మొదటి అంతస్తులో మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగులు అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లారు.

 

మంగళవారం ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం, పూజలు నిర్వహించేందుకు వెళ్లారు అర్చకులు. అయితే ఆలయ తాళాలు పగులగొట్టి ఉండడం కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి కిరీటం కనిపించలేదు. భక్తులు కానుకలు సమర్పించిన హుండీ లేదు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన అర్చకులు వ్యాస గుడి సమీపంలో హుండీ కనిపించింది.

 

అమ్మవారి ఆభరణాలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

 

ఈ ఘటనతో షాకయ్యారు ఆలయ అర్చకులు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయ వెనుక వైపు నుంచి లోపలికి దొంగలు వచ్చినట్లు నిర్ధారించారు పోలీసులు.

 

దొంగల వేలిముద్రలు, ఆధారాల కోసం క్లూస్ టీమ్‌ దిగేసింది. డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఇదిలాఉండగా ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగలు ఏ మార్గం నుంచి వచ్చారు? ఎంతమంది అనేదానిపై ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

 

ఆలయ విధుల్లో రాత్రివేళ ఆరుగురు హోంగార్డులు ఉన్నారు. అయినప్పటికీ దొంగలు తాళాలు పగులగొట్టి వెండి కిరీటం, హుండీని ఎలా ఎత్తుకుపోయారు? అనేదానిపై అనుమానాలు మొదలయ్యాయి. మరి చోరీ జరిగిన సమయంలో హోంగార్డులు డ్యూటీలో ఉన్నారా? లేదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. దొంగలను త్వరలో పట్టుకుంటామని, ఆలయానికి భద్రతను కఠినతరం చేస్తామని చెబుతున్నారు పోలీసులు.

ANN TOP 10