విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం సాయికృష్ణ అదృశ్యం కేసును మరింత సంచలనాత్మకం చేసింది. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కీలక సాక్ష్యాలైన సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది” అని అన్నారు.
సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి? సీసీటీవీ ఫుటేజీ మాయం కావడంపై ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు? అని రోజా ప్రశ్నించారు.
మరోవైపు, సాయికృష్ణను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి లాకప్ డెత్ చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి సిట్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, సీఐను సిట్ కార్యాలయానికి తరలిస్తుండగా అతని మద్దతుదారులు ఆందోళన చేపట్టి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సాయికృష్ణ కేసు గత వారం రోజులుగా ఏపీలో హాట్ టాపిక్గా మారింది.








