కన్నకూతరి ప్రేమకు అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. ఏకంగా సుపారీ ఇచ్చి మరీ ప్లాన్ ప్రకారం భర్తను కిరాతకంగా చంపించింది. తీరా ఏమీ ఎరగనట్టు భర్త మృతదేహం వద్ద మొసలి కన్నీరు కార్చింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పడమే ఆ తండ్రికి మరణ శాసనమయ్యింది. ప్రేమ పెళ్లి వద్దని కూతురిని గట్టిగా మందలిస్తే తండ్రిని పరలోకానికి పంపించేసింది తల్లి. కుటుంబంలో ఓ చిన్న సమస్య ఆ ఇంట పెద్ద హత్యకు దారీ తీసింది. ఈ ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన వ్యక్తితో కూతురి ప్రేమ, పెళ్లి ప్రతిపాదనను కాదన్నందకు ఆ తండ్రిని కానరాని లోకాలకు పంపారు.
దర్యాప్తులో సంచలన విషయాలు:
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈ నెల 21న జరిగిన మర్డర్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాజీవ్ నగర్లో ఉండే మెక్కం చిన్న అంజనేయులు మేకల కాపరిగా వృత్తి నిర్వర్తిస్తున్నాడు. ఆయన కుమార్తె అంజలికి హైదరాబాద్కు చెందిన పాండు అనే వ్యక్తితో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడడాన్ని తండ్రి చిన్న అంజనేయులు గమనించి మందలించాడు. తండ్రి మందలింపును లైట్ తీసుకున్న కూతురు పాండుతో పరిచయాన్ని అలానే కొనసాగించింది. ఈ క్రమంలో అదే వ్యక్తితో కూతురు ప్రేమ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఆవేశానికి లోనైన తండ్రి అంజనేయులు గట్టిగా మందలించాడు. ఆ సందర్భంలో అడ్డుపడబోయిన భార్య భాగ్యలక్ష్మీపై చేయిచేసుకున్నాడు. అనంతరం కూతరు ఆమె ప్రేమ వివాహన్ని నిరాకరించాడని భర్తపై కక్ష పెంచుకుంది భార్య భాగ్యలక్ష్మి. ఏకంగా భర్తను హత్య చేయించాలని డిసైడ్ అయి పక్కా ప్లాన్ చేసింది. భర్త హత్యపై ఎక్కడా, ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోని కాళ్ల మైసమ్మ అనే మహిళను ఆశ్రయించింది. హత్య చేసేందుకు సుపారీగా తమ వద్ద ఉన్న మేకల్లో మూడు మేకలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. కాళ్ల మైసమ్మకు ముత్యాలమ్మ, నర్సింహులు అనే మరో ఇద్దరు తోడయ్యారు. చిన్న అంజనేయులు హత్యకు పక్కాగా స్కెచ్ వేసి అమలు చేశారు.
కాళ్ళు, చేతులు అదిమి పట్టి.. గొంతుకోసి..
ముందస్తు ప్రణాళిక ప్రకారం భర్తకు మద్యం తాగించి మేకల షెడ్ వద్ద పడుకోబెట్టి వెళ్లిపోయింది భార్య భాగ్యలక్ష్మి. అనంతరం అర్దరాత్రి సమయంలో మైసమ్మ, ముత్యాలమ్మ, నర్సింహులు స్పాట్కు చేరుకున్నారు. మైసమ్మ, ముత్యాలమ్మ.. అంజనేయులు కాళ్లు అదిమి పట్టుకోగా, నర్సింహులు తన వెంట తెచ్చిన చిన్న కత్తితో గోంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి ఎవరికి వారు తలదాచుకున్నారు. భార్య భాగ్యలక్ష్మీ కాల్ డేటాతో హత్య అసలు కోణం వెలుగులోకి వచ్చింది.