(అమ్మన్యూస్, బెంగళూరు):
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమకూడా ఒకరు. దీంతో ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హేమ విచారణకు హాజరు కాలేదు.
నేను వైరల్ ఫివర్ తో బాధపడుతున్నాను. ప్రస్తుతం విచారణకు రాలేను. మరోసారి విచారణకు హాజరవుతానని చెబుతూ బెంగళూరు సీసీబీ పోలీసులకు నటి హేమ లేఖను పంపించారు. విచారణకు హేమతో పాటు మిగతావారు కూడా ఎవరూ హాజరుకాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇద్దరు కారు ఓనర్లకు, ఎమ్మెల్యే కాకాని కార్ స్టిక్కర్ ఉన్న కార్ ఓనర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి మరోసారి సీసీబీ పోలీసులు వివిధ తేదీల్లో విచారణకు రావాలని నోటీసులిచ్చారు. అయితే, జూన్ 1వ తేదీన విచారణకోసం హేమ బెంగళూరు వెళ్తారా? ఈసారి కూడా ఏదైనా కారణం చెప్పి విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.









