AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌..

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నేత మీనాక్షి నటరాజన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర విచారణ కోరింది.

 

తెలంగాణలో తనపై నమోదైన కేసు వివరాలను నామినేషన్‌ అఫిడవిట్‌లో వెల్లడించలేదన్న బీజేపీ అభ్యంతరం ఆధారంగా మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. అయితే ఆమెపై ఎలాంటి క్రిమినల్‌ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే జారీ అయిందని కాంగ్రెస్‌ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎంపీలు కే.సి. వేణుగోపాల్‌, జైరాం రమేష్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా సహా పలువురు నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి తమ వాదన వినిపించారు. మీనాక్షి నటరాజన్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందించామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

 

సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్‌పై క్రిమినల్‌ కేసు ఉన్నట్లు చెప్పడం సమంజసం కాదన్నారు. సంబంధిత కోర్టు ఇప్పటివరకు కేసును స్వీకరించలేదన్నారు. అది వెల్లడించాల్సిన కేసుల పరిధిలోకి రాదని వివరించారు. మరోవైపు పౌరహక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ కూడా రిటర్నింగ్‌ అధికారి నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కోర్టు అభియోగాలు నమోదు చేసిన తర్వాత మాత్రమే ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్‌ను తిరస్కరించడం చట్ట విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

 

ఈ వివాదం కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను కూడా బయటపెట్టిందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి వచ్చిన సమాచారమే ఈ వివాదానికి కారణమైందని మధ్యప్రదేశ్‌ మంత్రి కైలాష్‌ విజయవర్గీయ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకులే ఈ సమాచారాన్ని బయటకు ఇచ్చి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం, ఎన్నికల సంఘం తుది నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ANN TOP 10