ఈ నెల 30న లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో పర్యటించనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయనున్నారు. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేయనున్నారు. 30వ తేదీ నుంచి జూన్ ఒకటిన సాయంత్రం వరకు ఆయన ధాన్య మండపంలో ధ్యానం చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
2019 ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ గుహలో ధాన్యం చేసిన విషయం తెలిసిందే. కన్యాకుమారిని తన ఆధ్యాత్మిక విహారానికి వేదికగా ఎంచుకున్న ప్రధాని మోదీ నిర్ణయం దేశంపై వివేకానందుడి దార్శనికతను సాకారం చేయడంలో ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల తుది దశ పోలింగ్ జూన్ ఒకటి జరుగనున్నది. ఎన్నికలకు రెండురోజుల ముందు ప్రచారం ముగియనున్నది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.









