పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో ఇక అందరి దృష్టి పోలింగ్పై పడింది. మే 27వ తేదీన ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగింటికి ముగియనుంది. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. పోలింగ్ రోజు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 48 గంటలపాటు వైన్ షాపులు బంద్ చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 52మంది బరిలో ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్తో పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పోలింగ్ డే రోజు ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు. అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు.
అయితే సాధారణ ఎన్నికలతో పోల్చితే పట్టభద్రుల పోలింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది.. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యత తెలపాల్సి ఉంటుంది. ఒకటోవ ప్రాధాన్యత, రెండోవ ప్రాధాన్యత ఇలా వారికి నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది.









