ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం.. దేశమే కాదు ప్రపంచమే గర్వించతగ్గ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. అందుకు తగ్గట్లే రాజధాని ప్రాంతంలో చకచకా నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు.. సీడ్ యాక్సెస్ రోడ్డును సైతం ప్రారంభించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం రాజధానిపై తమ వ్యతిరేక స్వరంగా వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా పాటనే విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
వైసీపీ నేత అంబటి రాంబాబు.. తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. దానికి యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సాంగ్ లింక్ ను జత చేశారు. ‘నాటి అమరావతి అమరులు సంచరించిన పుణ్య భూమి.. నేటి అమరావతి అసురులు సంచరిస్తున్న పాపపు భూమి’ అంటూ అంబటి ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఇవే వ్యాఖ్యలను లిరిక్స్ గా చేసుకొని యూట్యూబ్ లో పాట ఉండటం గమనార్హం.
అంబటి విడుదల చేసిన అమరావతి సాంగ్ లో పంట పొలాల విధ్వంసం, వాటని అడ్డుకుంటున్న రైతులు కనిపించారు. పోలీసులు వారిని బలవంతంగా లాక్కుతున్న దృశ్యాలను వీడియోలో హైలెట్ చేశారు. అదే విధంగా కృష్ణానది వరదల సమయంలో అమరావతి ప్రాంతం నీట మునిగినట్లుగా ఉన్న దృశ్యాలను సైతం అందులో చూపించారు. గొప్ప చరిత్రకు సాక్షిగా నిలిచిన అమరావతి భూమి.. ప్రస్తుతం కాసుల కోసం పరితపించే భూమిగా మారిపోయిందని, దోపిడి దందాలకు నిలయమైందని, రైతులకు వెన్నుపోటు పొడిచిందని పాట రూపంలో విమర్శలు చేశారు.








