బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ (CBI) కస్టడీలో ఉన్న సోదరి కవితను (MLC Kavitha) కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్క్వార్టర్స్లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ సమయంలో కవితను కేటీఆర్ కలవనున్నట్లు తెలుస్తోంది.
నేడు కూడా విచారణ…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిన్న(శుక్రవారం) తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిన్నటి నుంచే కవిత సీబీఐ విచారణ మొదలైంది. నేడు కూడా సీబీఐ విచారణను కవిత ఎదుర్కోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లోధి రోడ్, జవహర్ లాల్ నెహ్రు మార్గ్లోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు.









