నల్గొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని.. ఈ విషయంలో ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 లక్షలు 53 వేల మందికి గృహజ్యోతి లో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లు మార్చి 11వ తేదీన ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
నల్గొండ జిల్లాలోని మామిళ్లగూడెంలో 50 ఎకరాల్లో రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టబోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, ఆర్థికంగా ఇబ్బందులున్నా హామీలు నెరవేరు స్తున్నామని వివరించారు. రూ. 40 వేల కోట్ల బకాయిలు ఉన్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్స్ ఇస్తున్నామని అన్నారు. తాము గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి రూ. 1000 మిగిల్చామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హారీష్ రావు, కేటీఆర్ పేద ప్రజల గురించి అలోచించలేదని చెప్పారు. ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని చూసైనా వారు నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.









