బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్
అమ్మన్యూస్, హైదరాబాద్ :మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరూ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోరని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. అవినీతి పార్టీతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటామని ప్రశ్నించారు.
బీజేపీతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు సంప్రదింపులు జరుపుతున్నారని బండి సంజయ్ చెప్పారు. వారు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లకుండా ఉండడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని పార్టీ నాయకులకు కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా పరస్పరం విమర్శలు చేసుకుంటూ బీజేపీ చర్చలో లేకుండా చేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అవినీతి అంతా కాగ్ రిపోర్ట్ ద్వారా బయట పడిరదని బండి సంజయ్ చెప్పారు. కాళేశ్వరంపై సెంట్రల్ కమిటీ చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం పనికి రాదని చెప్పిందని అన్నారు. ప్రజా సమస్యలు ఏమీ లేనట్లు ఒక నది జలాల విషయం పట్టుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటున్నాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ జైల్లో ఉండేవారని బండి సంజయ్ చెప్పారు.









