తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సజ్జనార్. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన డి. రమేశ్ చేసిన పనిని పొగుడుతూ ఓ పోస్ట్ చేశారు. ఇంతకీ ఎవరీ రమేశ్ ఆయన చేసిన పని ఏంటంటే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని దుబ్బచర్చకు చెందిన డి. రమేశ్ కుమార్ వ్యవసాయం చేస్తుంటాడు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతోన్న మరణాలు చూసిన ఆయన ఉచితంగా హెల్మెట్స్ను పంచడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కూడా భాగస్వామం చేయడంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశారు.
సజ్జనార్ ట్వీట్..
ఈ సందర్భంగా ‘ఎక్స్’లో ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘హెల్మెట్ లేని కారణంగా ఎందరో బైకర్స్ దుర్మరణం చెందుతున్నారు. అలా ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో హెల్మెట్లను పంచుతున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్లకు చెందిన డి.రమేశ్ కుమార్ గారు. వారం రోజులుగా 150 హెల్మెట్ లను ఆయన పంచారు. వ్యవసాయం చేసుకుంటూనే తన సొంత డబ్బులతో హెల్మెట్లు కొని.. అవసరం ఉన్న వారికి పంపిణీ చేస్తుండటం ఆదర్శనీయం. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డి.రమేశ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. మరో వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టేందుకు రమేశ్ చేస్తున్న పని నిజంగా అభినందించతగినదే కదూ.









